Chandrababu: ఏమీ చేయడంట... ఏమీ చెప్పడంట... మీరంతా ఓట్లేయాలంట!: ఏలూరులో చంద్రబాబు

  • ఏలూరులో ప్రజాగళం సభ
  • కూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న చంద్రబాబు
  • కూటమి మేనిఫెస్టో కళకళలాడుతోందని వెల్లడి
  • జగన్ మేనిఫెస్టో వెలవెలబోతోందని ఎద్దేవా
Chandrababu speech in Eluru

టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరులో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు భారీగా రోడ్లపైకి తరలి రావడం చూస్తుంటే కూటమి గెలుపును ఎవరు అడ్డుకోలేరన్న విషయం అర్థమవుతోందని, ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు... గెలుపు మనదే అని అన్నారు. 

ఇక ఎన్నికలకు మూడు రోజులే ఉంది... చివరి దశకు వచ్చాం... మన భవిష్యత్తును మార్చుకునేందుకు, మన పిల్లల భవిష్యత్ ను మార్చుకునేందుకు ఇక మూడ్రోజులే మిగిలుంది... అందుకే అందరూ సైకిల్ ఎక్కండి... టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి... అక్కడ్నించి సైకిల్ స్పీడు పెంచండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

"ప్రజలు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదు... రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. ఇక్కడే పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసైనికులు ఉన్నారు. సమాజ హితం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్... పడరాని అవమానాలు పడ్డాడు. బీజేపీ నేతలకు, కార్యకర్తలకు కూడా చెబుతున్నా. గెలుపే ధ్యేయంగా పనిచేయాలి, అన్ని సీట్లు మనమే గెలవాలి, ఈ సైకోను సాగనంపాలి. 

కూటమికి ప్రజలు వేసే ఓటు రైతుకు సాగునీరు తెస్తుంది, పంటలకు గిట్టుబాటు ధర తెస్తుంది, మీ బిడ్డలకు బంగారు భవిష్యత్ ను అందిస్తుంది, నిరుద్యోగ సమస్యను తొలగిస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. అందుకే కూటమి తరఫున హామీ ఇస్తున్నాం. నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం. 

ప్రజలు వేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్ మద్యాన్ని పూర్తిగా తొలగించేందుకు ఉపయోగపడుతుంది. మీరు వేసే ఓటు విద్యుత్ చార్జీలు పెంచకుండా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కరెంటు చార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి? ఈ ప్రభుత్వాన్ని నడిపే సైకోకు బుద్ధి ఉందా? కొంప గుల్ల చేశాడా, లేదా? నిత్యావసరాల ధరలు పెరిగాయా, లేదా? పెట్రోల్  డీజిల్ ధరలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? ఆఖరికి చెత్త మీద కూడా పన్నేశారు.

మందుబాబులను చూస్తే నాకు బాధేస్తోంది. నేను అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడది రూ.200. ఎంత దోచుకుంటున్నాడో చూడండి. ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్ ను ఇబ్బందిపెట్టారు, విమర్శించారు... నేను మీ కోసం పోరాడుతుంటే నన్ను జైల్లో పెట్టిన సైకో ఈ జలగ. 

నన్ను అక్రమంగా జైల్లో పెట్టినప్పటి కంటే పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినప్పుడు ఎక్కువ బాధ కలిగింది. పోలవరం... మన రాష్ట్రానికి మంచి ప్రాజెక్టు. అది పూర్తయి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. కానీ నాశనం చేశాడు. నాపైనా, నా కుటుంబంపైనా వైసీపీ దాడి కంటే... ఈ రాష్ట్రంపై వైసీపీ కొట్టిన  దెబ్బ చాలా బాధ కలిగిస్తోంది. ప్రజల జీవితాలు 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. నాపై అవినీతి ముద్ర వేయడం బాధ కలిగించినా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అంతకంటే బాధ కలిగించింది. 

వైసీపీని అధికారం నుంచి దించడమే కాదు, రాష్ట్రంలో సంపద సృష్టించి ఆదాయం పెంచి, పెంచిన ఆదాయాన్ని పంచడాన్ని బాధ్యతగా తీసుకుంటాం. మన మేనిఫెస్టో కళకళలాడుతుంటే, జగన్ ఎన్నికల మేనిఫెస్టో వెలవెలపోయింది. ఏమీ చేయడంట... ఏమీ చెప్పడంట... మీరంతా ఓట్లేయాలంట! నేను అలా కాదు... మీ ఆశలు, మీ కోరికలు తీర్చే బాధ్యత నాది. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది.

రైతుకు అన్నదాత కింద రూ.20 వేలు ఇచ్చి, గిట్టుబాటు ధర కూడా కల్పిస్తాం. పెన్షన్ అనే మాట తీసుకువచ్చింది ఎన్టీఆర్. నేను వచ్చిన తర్వాత రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేశాను. ఇతడు పెంచింది ఐదేళ్లలో  రూ.1000. ఇవాళ నేను హామీ ఇస్తున్నా... రూ.4 వేల పెన్షన్ ను ఏప్రిల్ నుంచే ఇస్తాను. మీ ఇంటి వద్దే పెన్షన్ ఇస్తాను. ఈ జలగ జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట! ఎవరు పేదల మనిషో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటాను. 

నా ఎస్సీలు అంటాడు... ఏమీ చేయడు కానీ చంపేసి డోర్  డెలివరీ చేస్తాడు. నా ఎస్టీలు అంటాడు... జీవో నెం.3 రద్దు చేసి వాళ్ల పొట్టకొడతాడు. నా బీసీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు... ఏమైనా చేశాడా? ఇప్పుడంటున్నాడు... ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను నేను రద్దు చేస్తానంట! రద్దు చేయను... కాపాడతాను. అవసరమైతే  కోర్టులో న్యాయపోరాటం చేసి మైనారిటీల హక్కులకు భరోసాగా నిలుస్తాం. 

సీఏఏ, ఎన్నార్సీ విషయంలో కేంద్రంలో బిల్లు పాస్ కు ఆమోదం తెలిపింది ఈ వైసీపీ ప్రభుత్వం. వీళ్లు ఢిల్లీలో సపోర్ట్ చేస్తారు... గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తారు. నేను ఎప్పుడూ చెప్పిందే చేస్తా... చేసేది కూడా పారదర్శకంగా చేస్తా. జగన్ చేసేది చీకటి రాజకీయాలు... నేను చేసేది ఈ రాష్ట్రానికి వెలుగు తీసుకొచ్చే రాజకీయాలు. నీ పొత్తు నీ కేసుల మాఫీ కోసం... అరెస్ట్ ను తప్పించుకోవడానికి! మా పొత్తు... రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పు నుంచి గట్టెక్కించడానికి, ప్రజల జీవితాల్లో  మళ్లీ వెలుగు నింపడానికి. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జాగ్రత్తగా ఉండాలి. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల పెను ప్రమాదం ఉంది" అంటూ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News